This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 

                   రుద్రమదేవి ఎక్కడ స్నానం చేసేది ?

వరంగల్ లో నగరం నడి బొడ్డున నిరాదరణతో శిధిలమవుతున్న పురాతనమైన అంతస్థుల బావి.

ఈ బావి ఎవరు కట్టించారు? దేని కోసం వాడి వుండే వారు? దీని నిర్మాణం ఆధారంగా ఎటువంటి విశేషాలను అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడీ నిర్మాణాల వివరాలను మనకందించేందుకు ఇంకా సజీవంగా వున్న ఈ అపురూప నిర్మాణాన్ని మరింత అధ్యయనం చేసేందుకు సంరక్షించు కుందామా? నిర్లక్ష్యంతో చేజార్చుకుందామా?
 
పొద్గాల పొద్గాల ఇందే పిచ్చి ప్రశ్న అని క్వశ్చన్ మార్క్ ఫేసుతో నన్ను తిట్టుకుంటున్నారా? ఆగండాగండి.
మీక్కొన్ని ముచ్చట్లు జెప్పాలె. ఔ గదా రాణీ వాసం స్నానం జెయ్యాల్నంటెనే శానా పరేశానుంటదీ.
మరి రుద్రదేవునిగా పెరుగుతున్న ఆడపిల్ల ఆ రహస్యం బయట పడకుండా మేనేజ్ చెయ్యాలంటే మరెంత పఠిష్టమైన ఏర్పాట్లు వుండి వుండాలి.
మరా సంగతులు చెప్పేందుకు ఇప్పుడు గణపతి దేవుడూ లేడు. శివదేవయ్య మంత్రి గారూ లేరు.
ఆ విషయాలు రాసిన పుస్తకాలో శాసనాలో దొరికే అవకాశమూ లేదు.
‘ఆదిత్య 369’ టైం మిషన్ లోనో, ఈమధ్య కాలపు సూర్య ‘24’ సినిమాలోని చేతి గడియారంతోనో మనమా కాలానికి వెళ్లి విషయాలను అర్ధం చేసుకునే టెక్నాలజీ సైతం పెరగలేదు.
ఇదుగో ఈ దృశ్యకం(చిత్రం) చూస్తున్న కొన్ని నిర్మాణాలు మాత్రం ఇంక మనకోసం ఇంకా మిగిలే వున్నాయి.
అవి ఎందుకు నిర్మించి వుంటారు? వాటి నిర్మాణ పద్దతుల వెనకున్న విశేషాలు దేనికి అనుకూలంగా వున్నాయి?
అనే అంశాలను కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే శిధిల నిర్మాణం మౌనంగా తన మనసు లోతుల్లో దాచుకున్న ఎన్నో విశేషాలు మనకు వినిపిస్తాయి.
నీళ్ల కోసం జల వున్న చోటు డ్రౌజింగ్ పద్దతుల్లో చూసి మరీ బావులు తవ్వటం మనకు తెలుసు.
వాటిని మెట్ల బావులుగానో, మోట బావులుగానో మార్చడమూ తెలుసు.
స్నానాలకూ, జలకాలాటలకూ కొలనులూ, సరస్సులూ నిర్మించారన్న సంగతులూ తెలుసు.
మరి ఇదేమిటి ఇది బావి మాత్రమే కాదు. కొలనో, సరస్సో మాత్రమే అంతకన్నా కాదు.  అ అ అ అంతకు మించి....
వరంగల్ కోటకు రెండు కిలోమీటర్ల లోపు దూరంలో, వరంగల్ చౌరాస్తాకు దగ్గర్లో ప్రస్తుతం శివనగర్ ప్రాంతంలోని పాత ఇనుప సామాను కొట్టు వెనక పిచ్చి ముళ్ళపొదల మధ్యలో ఒక అపూర్వ నిర్మాణం దాక్కుని వుంది.
పైన చుట్టూ కట్టిన గొడలున్నాయి. వాటికి దగ్గరగా వెళితేనే అక్కడ నలు పలకలుగా ఒక బావిలాంటి నిర్మాణం వున్నట్లు తెలుస్తుంది.
లోపట మెట్లూ స్తంభాలూ కనిపిస్తున్న వాటి దగ్గరకు దిగి ఎలా వెళ్లాలో వెంటనే ఒక పట్టాన తెలియదు.
కొంచెం ఈ నిర్మాణానికి తూర్పు వైపుగా వచ్చి చూస్తే నేల మాళిగలోనికి దిగటానికి వున్నట్లు క్రిందుగా మూడ్నాలుగడుగుల వెడల్పుతో భూమి లోపలికి మెట్లు కనిపిస్తాయి.
అలా అరడుగు ఎత్తున్న ఒక ఇరవయ్యేడు మెట్లు దిగగానే చక్కటి వరండా వంటి నిర్మాణం, దానికి స్థంభాలూ, స్లాబూ వగైరా ఒక భవంతేనేమో అనిపించేట్లుగా వుంది.
అందే కాదు ఆ వరండా ఆధారంగా క్రింద నున్న కొలనుకి చుట్టూ తిరిగి వచ్చే అవకాశమూ వుంది.
గోడలపై కప్పులపై అక్కడక్కడా కొన్ని శిల్పాలున్నాయి. హటాత్తుగానో, క్యాజువల్ గానో చూస్తే అవే మరేదో నిర్మాణం నుంచి తొలగించి తీసుకురావడం వల్ల ఇక్కడ శిల్పాల లాగా కనిపిస్తున్నాయిలే అన్నంత మామూలుగా వుంటాయి. స్తంభాలు సైతం అనీక్వల్ డెకరేషన్ తో వున్నాయి.
ఒక స్తంభం సుందరంగా చెక్కినట్లువుంటే, మరికొన్ని స్తంభాలు కేవలం రాతి నిర్మాణాలుగా మాత్రమే వున్నాయి.
కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బొమ్మల వెనుక ఒక శ్రేణీ విధానమేదో వున్నట్లు కొన్ని చోట్ల కనిపిస్తుంది.
ఉదాహరణకు మెట్లు దిగగానే ఎడమ వైపున రెండు చతుర్దళ పద్మ పట్టికలు వున్నాయి. అంటే నాలుగు రేకులున్న తామర పూల రాతి ఫోటో ప్రేమ్ లాంటిది వుంది.
దానికి ఖచ్చితంగా ఎదురుగా ఒక అంతస్థు దిగువలో క్రిందకు వెళుతున్న మెట్లకు కుడివైపున అష్టదళ పద్మ పట్టికలు నాలుగున్నాయి. అంటే ఎనిమిది ఆకులున్న తామరపూల రాతి ఫోటో ప్రేములు నాలుగున్నాయి.
అంటే ఏం జరిగింది. ఇక్కడున్న రేకుల సంఖ్యతో పాటు పూల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది.
అది కూడా ఒక అంతస్థు దిగువలో ఖచ్చితంగా దీనికి ఎదురుగా వచ్చేలా.
నా అంచనా నిజమైతే దానికి మరో అంతస్థు దిగువలో మరో సమాధాన చిత్రం వుంటుంది.
అది కూడా కొంత సమాచారాన్ని తెలియజేసేది అయ్యివుండవచ్చు. కానీ ఈ రెండు బేస్ మెంట్ గదులకు క్రిందున్న దంతా నీళ్లతో నిండిపోయివుంది.
ఆ ఏరియాలో ఇళ్ళు కడుతున్న వారు 300 అడుగులకు బోరు దింపినా నీళ్లు పడక ఇబ్బందులు పడుతుంటే, ముప్ఫై అడుగుల లోతులోనే ఇప్పటికీ నీళ్లు వుండేందుకు ఈ నిర్మాణంలో వున్న రహస్యం ఏమిటో అర్ధం చేసుకోవాలి.
భూగర్భ జల ఖచ్చితంగా వున్న చోటుని చూసి ఈ నిర్మాణం చేయడం వల్ల ఇది సాధ్యమయ్యిందా?
లేక దగ్గరలోని మరేదైనా జల వనరుకి దీనిని జతచేయడం వల్ల నీళ్ళు నిరంతరం ఇలా ఊరుతూ వున్నాయా? అనే విషయాన్ని అర్ధం చేసుకోవలసి వుంది.
నీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే లోపలి నుంచి నిరంతరం గాలి బుడగలు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలనుంచీ బయటికి వస్తున్నాయి.
అంటే ఇక్కడి నీరు ప్రవాహంగా ఎటువైపో వెళుతోంది. మరెక్కడినుంచో గాలి నీటి లోపలికి ప్రవేశిస్తూ వుంది. దాని ఆనుపానులను అర్ధం చేసుకోవాలి.
ఏదేమయినప్పటికీ ‘మిషన్ కాకతీయ’ లాంటి పనులకు బోలెడన్ని నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం అదే స్పూర్తితో ఈ బావిలో ప్రస్తుతమున్న మురికి నీటినీ, పూడికనూ తొలగించి తదనంతర అధ్యయనాల కోసం 3డి మ్యాపింగ్
పద్దతిలో నమోదుచేసుకుని ఆ తర్వాత నీటి బావిని అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.
కానీ కనీసం ఇంత అపురూప నిర్మాణాన్ని ఇంకా రక్షిత కట్టడంగా గుర్తించేందుకు ప్రతిపాదనలైనా పంపినట్లు లేరు.
ఇక పునరుద్ధరణ తదనంతర అధ్యయనం కూడానా?
అసలు ఈ బావివున్న ప్రదేశమే ప్రయివేటు ప్రాపర్టీలో రిజిస్టరు అయ్యివున్నదట.
సరే మొదటి బేస్ మెంట్ అంతస్థులో వున్నవిశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా.
అది మరీ ఖచ్చితంగా ఆరడుగుల ఎత్తుమాత్రమే కట్టినట్లున్నారు.
విశాలంగా అందరూ తిరిగేందుకు అన్నట్లు కాకుండా అవసరం నిమిత్తం ఇబ్బంది పడకుండా వాడుకోవాలి అన్నట్లు  వుంది ఆ అంతస్థు ఎత్తు.
అంతే కాదు దాని పై కప్పుగా రాతి దూలాలను వేసినప్పటికీ వాటి పైన మళ్లీ మామూలు మట్టి కప్పి, మొత్తంగా అంతవరకూ నేలలో భాగంగా కలిసి పోయేలా చేసినట్లున్నారు.
మధ్యలో వున్న భాగం పైన సైతం ఏనుగుల ట్రాప్ పై మూత పెట్టినట్లు పెడితే క్రింద బావి వున్నదనే విషయం ఏమాత్రం అర్ధం కాదు. ఈరోజు మనం టెస్టు కోసం ప్రయత్నించినా సరే.
అలా మూసే అవకాశం వుంది. సరే మరి అటువంటి అవకాశాన్ని ఎందుకోసం ఉపయోగించుకుని వుంటారు?
ఒకటి.. క్రింద ఆంతరంగిక లేదా రహస్య కార్యకలాపాలు బహిరంగపడకుండా దాచి వుంచేందుకు.
రెండు.. దానిపై నుంచి మాత్రమే పయనించేలా అవకాశం ఏర్పాటు చేసిన అత్యవసర ద్వారంలో తప్పించుకునే శత్రువులు కోట చుట్టూ వున్న కందకాల ట్రాప్ లో పడినట్లు పడిపోయేందుకు గానూ,
లేదా రెండు అవసరాలూ కలిసి వచ్చేలాగానూ కావచ్చు. అదే పద్దతిలో ప్రతి అంతస్తునూ మూసుకుంటూ వెళ్ళవచ్చు.
మొత్తంగా మూయోద్దు అనుకుంటే అప్పటి దేవాలయాల కప్పులను మూసేందుకు వాడిన కార్నర్ కవరింగ్ పద్దతిలో పేర్పిడుల పద్దతిలో సైతం వాటిని మూసే అవకాశం వుందని చెపుతూ మొదటి అంతస్థు అంచుల్లో వున్న మూల రాళ్లు చెపుతున్నాయి.
మెట్ల నుంచి వెళ్లిన తర్వాత ఎడమ వైపుకు తిరిగితే, దాని నుంచి పడమటి దిశగా చూస్తున్న పది మంది మదనికలు, లేదా సాలభంజికలు వారి వ్యాళాలున్న రాతి కుడ్య చిత్ర ఫలకం వుంది.
ఈ పటం ఐదు గదులుగా విభజింపబడి వుంది. ఒక్కో గదిలో ఇద్దరు సాలభంజికలున్నారు.వారి భంగిమలు వేర్వేరుగా వున్నాయి.
మరి వాటిని నాట్యశాస్త్రపరంగా లేదా ప్రత్యేకార్ధ పరంగా వివరణను పరిశోధకులు ప్రత్యేకంగా విశ్లేషణ చేయవలసిన అవసరం వుంది.
ఈ ఐదు గదులు మొదటి అంతస్థులో కనిపిస్తున్న గదులకు రెప్లికాలు అనుకున్నట్లయితే,
ఈ నీటి కొలను దగ్గరకు అంతఃపుర స్త్రీలు వచ్చేవారనే విషయం ఈ చిత్రం వివరిస్తున్నట్లవుతుంది.
వారి తలలపై వున్న కప్పు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నట్లంది.
కేవలం స్తాన పానాదులే కాక వినోదించే వారనే దానికి సూచనగా వారి చేతుల్లోని మద్దెల వంటి సంగీత వస్తువులు నాట్య భంగిమలూ సూచిస్తున్నాయి.
అంటే రాచకేళీ ప్రదేశమని కానీ, అంతఃపుర కాంతా విహారిత క్షేత్రమని కానీ అర్ధం చేసుకోవచ్చు.
అదే విధంగా మెట్ల నుంచి కుడి వైపుకు వున్న రాతి స్తంభాలను పరిశీలిస్తే ఒక దగ్గర సూర్యచంద్రుల చిత్రం కనిపించింది.
ఇది కాకతీయులు ప్రతీ శాసనంలోనూ ఆచంద్రార్కం అనే అర్ధంలో వాడిన శిల్ప నిర్మాణం అయితే దాని క్రింద అక్షరాలు వుండే అవకాశం వుంటుంది కదా అని మరికొంత జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆశ్చర్యకరంగా నిజంగానే అక్కడ కొన్ని అక్షరాలు కనపిస్తున్నాయి.
కాలక్రమంలో జరిగిన నీళ్ల ఒరిపిడి వల్ల కావచ్చు. లేదా కాకతీయుల తదనంతర కాలంలో ఈ నిర్మాణాన్ని వాడుకున్న ముస్లిం రాజులు చెరిపి వేయడం వల్ల కావచ్చు. మట్టి సున్న పేరుకున్న అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు.
జాగ్రత్తగా పైనున్న చిలుము (రస్ట్)ని తొలగించి జాగ్రత్తగా వాటిని శాస్త్రీయ పద్దతిలో పరిశీలిస్తే కొంత సమాచారం దొరకవచ్చు.
ఆ తర్వాతి అంతస్థులోకి దిగే మెట్లకు ఎడమ వైపున కూడా శాసన ఫలకంలా ఏర్పాటు చేసిన రాయి అయితే వుంది.
కానీ దానిలో అక్షరాల జాడలు సైతం అర్ధం కావడం లేదు. మరి నీళ్ల లోపలున్న నిర్మాణంలో మరింకేమైనా వున్నాయేమో చూడాలి. మెట్లకు ఎదురుగా పడమటి దిశలో వున్న స్తంభాలలో ఖచ్చితంగా మధ్యలో వున్న స్తంభం ఎందుకో ప్రత్యేకంగా అందంగా నగిషీ పనితనాన్ని కలిగివుంది.
అటువంటి స్తంభ నిర్మాణమే మనం ఇంతకు ముందు చెప్పుకున్న రాతి ఫలకాలలోని మినియేచర్ స్తంభాలలోనూ స్పష్టంగా చెక్కబడి వుంది.
అప్పట్లో మొత్తం గుడి వంటి నిర్మాణాల కోసం శిల్ప శాస్త్రం వున్నట్లే, స్తంభాలు ఎలా వుండాలి?
ఏ పద్దతిలో చెక్కాలి అనే విషయంలోనూ ప్రత్యేక అధ్యాయాలున్నాయి.
దానిలో కాకతీయులది ప్రత్యేక శైలి. కానీ కుడ్య చిత్రాలలోని స్తంభాలలో సైతం అచ్చంగా అటువంటి రూపునే తేడా లేకుండా ప్రతిఫలింపజేయటం చాలా ప్రత్యేకమైన విషయం.
ఈ స్తంభానికి పైన మోట కోసం వాడిన రాళ్ళ పేర్పిడి లాంటిది కనిపిస్తోంది.
బహుశా దానికి వాడిన సున్నపు అతుకులను చూస్తే అది ప్రారంభం నుంచి వున్నట్లుగా కాక నిజాంల కాలంలో కానీ, నీటి సరఫరా కోసం వాడి వుంటారేమో అని అంచనా వేసేందుకు అనువుగా వుంది.
స్తంభ నిర్మాణానికి సంభందించే మరోక ఆశక్తికరమైన అంశం పైరాళ్లు స్తంభాలపై సరాసరి ఆధారపడటం కాక, వాటిపై వుంచిన మూడు లేదా నాలుగు చిన్న ఇనుప ముక్కలపై ఆధారపడివున్నాయి.
ఇనుప ముక్కలు కాక మిగిలిన ప్రదేశం అంతా ఖాళీగా వుంది.
స్థంభం పై భాగంలోనే కాక స్థంభం అడుగు భాగంలో సైతం ఇదే పద్దతిని గమనించవచ్చు.
మరి రీ-- ఇన్ ఫోర్సుడు కాంక్రీటులాగా ఈ ఇనుప ముక్కలకు మధ్య మరేదైనా సున్నం, మైనం లాంటి జిగిరు పదార్ధం నింపితే కరిగి పోయిందా, లేక అసలు మొదటి నుంచే ఇలా నిర్మించారా?
లేక స్థంబాల ఎత్తుని క్రింద ఒక అంగుళం పైన ఒక అంగుళం పెంచడం కోసమే వీటిని వాడాల్సి అవసరం వచ్చిందా?
మరి అట్లా కూడా కాక నీటి లోపల వుండే ఈ స్తంభాలు అదే పద్దతిలో నిర్మించడం వల్ల ఏదైనా ప్రత్యేక ప్రయోజనం వుందా?
అనే అంశాలను పరిశీలన చేయవలసి వుంది. ఇక దాని తర్వాత లోతులో వున్న నిర్మాణంలోకి దిగితే అది మొదటి దానికంటే సహజంగానే తక్కువ వైశాల్యాన్ని కలిగివుంది.
స్తంభాల సంఖ్యతో పోల్చుకుని చూస్తే అలా తగ్గటం కూడా ఒక జామెట్రికల్ లెక్కకు సరిపోయేలా వుంది.
మొదటి విజిట్ లో టేపులూ, కొలతలూ లేకుండా వెళ్లడంతో ఆ వివరాలను ఇప్పుడు ఇవ్వలేక పోతున్నాను.
మరోసారి సందర్శన వీలయితే, ఈ కొలతల జామెట్రికల్ వివరణను ఎలివేషన్ ఆధారంగా లెక్క వేసి అందజేసే ప్రయత్నం కూడా చేస్తాను.
నీళ్ల వరకూ ఏర్పాటు చేసిన దీనిలోని మెట్లు మనం ఇప్పటి వరకూ దిగివచ్చిన మామూలు మెట్ల కంటే ఎక్కువ
ఎత్తున్నాయి. కానీ దృఢంగా వున్నాయి.
మొదటి అంతస్థులో మూలనున్న స్థంభాలతో కలిపి వరుసలో పది స్తంభాలుంటే అందే పద్దతిలో లెక్కిస్తే మూలనున్న స్తంబాలతో కలిపి ఆ తర్వాతి అంతస్థులో ఐదు స్థంబాలకు సంఖ్య తగ్గింది.
లేదా నాలుగు మూలల్లో వున్న స్థంబాలు రెండు వరుసలకూ కామన్ కాబట్టి వాటిని వదిలేసి రెండు మూలల మధ్య నున్న స్థంభాలను మాత్రం లెక్కిస్తే మొదటి నేలమాళిగ లో 8,
ఆ తర్వాతి లోతులోని మాళిగకు 4 స్థంభాలు లెక్కన వున్నట్లు.
మరి అదే పద్దతిలో చూస్తే ఆ తర్వత మరి కొంచెం ఇరుకుగా వున్న మరో నేల మాళిగ అంతస్థు వుండవచ్చని ఈ జామెట్రికల్ లెక్క ప్రకారం దానిలో రెండు స్థంభాలుండే అవకాశం వుందనీ అంచనా వేయవచ్చు.
ఇలా లోతు పెరుగుతున్న కొద్దీ వైశాల్యం తగ్గటంతో ఈ నేల మాళిగ కట్టడం ఆకారం ఒక చతురస్రాకారపు గరాటా (ఫన్నెల్)ను పోలి వుంది.
మొదటి అంతస్థులోపటికి తూర్పు వైపు నుంచి క్రిందకు దిగేలా మెట్లు వున్నట్లే ఆ తర్వాతి అంతస్థు లోపలికి మరింత అవతలి నుంచి సొరంగ మార్గపు మెట్లు వుండే అవకాశం కనిపిస్తోంది.
వరంగల్ పోర్టు కూడా దీనికి దగ్గరలోనే వుంది.
ఆ వైపునుంచి ఈ సొరంగగాని వస్తోందని గమనించ గలిగితే పరిశోధనలోని పరికల్పనకు మరికొంత ఆధారం దొరికినట్లవుతుంది.
మరి అంతశ్రద్ధగా ఈ పురాతన కట్టడంపై పెట్టుబడులు పెట్టి అధ్యయనం చేయగల శ్రద్ధ ఉన్న వారెవరు?
ఎవరికి పట్టిన నొప్పి కనుక ఇదంతా కాపాడుకునేందుకు?
అసలు విషయం మర్చిపోయాను. ఇది ఎలా వెలుగులోకి వచ్చింది అనుకుంటున్నారు.
@Aravind Arya Padike అనే చరిత్రపై అపారమైన ప్రేమ వున్న ఒక డిగ్రీ విద్యార్ధీ,
అతని మిత్రులూ దీని గురించి ఎక్కడో విని వారం రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా అక్కడికి వచ్చి, చుట్టూ వున్న చెట్టూ, చేమా, ముళ్ల మొక్కలను తొలగించి పేరుకున్న మట్టినీ, వ్యర్ధాలనూ పారలతో గీరేసి ఒక రూపానికి వాలంటరీగా తీసుకురావడం వల్ల మీరూ నేనూ ఇప్పుడిలా చూడగలుగుతున్నాం.
కానీ, మెట్ల దారికి ఒక గేటు లాంటిదేమీ బిగించేందుకు ఫండ్స్ ఏమీ లేకపోవడంతో..
ఆ దారిగుండా లోపలికొస్తున్న ఆకతాయిలకు ఇది అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మారింది.
ఈ అంతస్థులు నేల మాళిగ కొలనును నేను ‘అరవింద్’తో కలిసి సందర్శించే సమయంలో కూడా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల జనం టాయిలెట్ గా వాడి, అసహ్యంగా మార్చిన ప్రాంతాలను, వాడి పారేసిన మధ్యం సీసాలనూ దాటుకుంటూనే పరిశీలించాల్సి వచ్చింది.
టీవీ సీరియళ్లూ, సినిమా షూటింగుల కోసం అధ్బుతంగా ఉపయోగపడే ఈ పర్యాటక ప్రాంతాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే విజిటర్స్ ద్వారా వచ్చే ఆదాయమే కాక దాని ప్రత్యేకతల ద్వారా వచ్చే గొప్పపేరు నాలుగు కాలాల పాటు
నిలచి వుంటుంది.
అపురూప మైన ఇటువంటి నేలమాళిగ బావులు మరేవైనా అసంపూర్తిగా దొరికితే వాటిని సరిగా అధ్యయనం చేసేందుకు ఇది ఒక చక్కటి నమూనాగా మిగులుతుంది.
చారిత్రక ఆధారాలు అసలేం లేనివాడు లేక ఏడుస్తుంటే, అడుగడుగునా అబ్బురపరచే చారిత్రక సాక్ష్యాధారాలు దొరుకుతుంటే, వళ్లొంగనివాడు నిర్లక్ష్యంగా కళ్లు మూసుకుంటుంటాడు.
1) ఈ అపూర్వ నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే తన ఆధీనంలోకి తీసుకోవాలి.
అది చేతకాకపోతే కనీసం ఏదైనా ప్రయవేటు ట్రస్టుకు నిబంధనల మేరకు దారాదత్తం చేసినా మంచిదే.
2) చుట్టూ గోడ ఎత్తును పెంచి, ముందు వైపు గేటును బిగించి తాళం వేయించాలి.
3) లోపల వున్న మురుగు నీటినీ, పూడికనూ తొలగింపజేసి నిర్మాణాన్ని శాస్త్రీయంగా అద్యయనం చేయాలి.
4) 3డి ఇమేజింగ్ త్ పాటు వివరాల బ్రోచర్ ను విడుదల చేసి, పరిశోదకులకు అందుబాటులోకి తీసుకు రావాలి.
మరిన్ని ఇంటర్ప్రిటేషన్లకు తలుపులు తెరవాలి.
 
కట్టా శ్రీనివాస్,
ప్రముఖ విద్యావేత్త, చరిత్ర పరిశోధకులు.
(అరవింద్ తో కలిసి)