This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
కథ కంచికి వెళ్ళిపోయింది ... చరిత్ర మాత్రం మిగిలింది 
 
సుమారు 60 మంది హీరోయిన్ లతో స్టెప్పులేసి, డ్యూయెట్ లు పాడి,
రొమాన్స్ చేసి, ఆ రోజుల్లో ఓ కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న
అక్కినేని కలలోకి ఏ హీరోయిన్ రాలేదా ? 
ఇదే మాట ఆయన్నే నేరుగా అడిగితే 'ఎందుకు రాలేదు ... వచ్చింది ...
కాకపోతే ఆమె హీరోయిన్ కాదు' అని అన్నారాయన. హీరోయిన్ కాకపోతే ఇంకెవరయి వుంటారు ? మనసుకి నచ్చిన ప్రతి వారితో ఎంతో చనువుగా వుంటారాయన. అలాంటిది  ఆయన కలల్లోకి చొరబడే ఆ డ్రీమ్ గర్ల్ ఎవరై
ఉంటారు ? 'అమ్మో ... నేన్చెప్పను గాక చెప్పను' అంటూ ఓ రెండు మూడు
రోజులు బ్రతిమాలించుకుని ఆ రహస్యాన్ని బైట పెట్టారాయన -
'సూర్యకాంతం' అని. 
ఈ మాట ఎవరు విన్నా ఆశ్చర్యపోతారు. ఆయన మనల్ని ఆట పట్టిస్తున్నారనుకుంటారు. కానీ ఇది నిజం. 'భార్యా భర్తలు షూటింగ్ లో
... ఓ సీన్ లో ఆవిడ అద్దం ముందు కూచొని తల దువ్వుకుంటూ ఉంటుంది. ఆవిడ వెనక సోఫాలో నేను కూచొని వున్నాను. లావుగా వున్నా కళ గల ముఖం అనుకున్నాను. అంతే ... అదే సబ్ కాంక్షస్ లో రిజిస్టర్
అయిపోయిందనుకుంటాను ... అదే రోజు రాత్రి ఆవిడ కల్లోకొచ్చింది.
'ఏ .. ఏ ..ఏ ..' అంటూ పెద్ద అరుపుతో లేచి కూచున్నాను.
'ఏంటండీ ... ఏమయ్యింది ... ఎప్పుడూ ఇలా నిద్దట్లో అరవలేదు ?' అంటూ అడిగింది అన్నపూర్ణ. 'సూర్యకాంతం కల్లోకొచ్చింది' అని చెప్పాను. అంత అర్ధరాత్రిలోనూ .. మా ఆవిడ ఒకటే నవ్వు  ' ఏ సావిత్రో, జమునో,
కృష్ణకుమారో రాకుండా సూర్యకాంతం ఏమిటండీ మరీనూ ?  ' అంటూ.   
 
'ఈ ఎక్స్ పీరియెన్స్ నేను షూట్ చేసుకుంటాను' అని అడిగాను.
'ఒద్దు ... పెద్దావిడ ... బావుండదు ... పైగా ఆవిడ నన్ను 'తమ్ముడూ'
అని అంటుంది. పత్రికల్లోకైతే ఓకే గాని విజువల్ గా వద్దు. పాఠకులు అర్ధం చేసుకోగలరు గానీ ప్రేక్షకులు వాళ్ళలా అలోచించలేరు' అని అన్నారు.
అంత క్లియర్ కన్విక్షన్ వున్న వ్యక్తి ఆయన. 
అలాగే కమిట్ మెంట్ విషయంలో కూడా అటువంటి వ్యక్తిత్వం
మరొకరిలో కనబడదు. మా టీవీ కోసం చేసిన 'గుర్తుకొస్తున్నాయి'
షూటింగ్ టైమ్ లో 'ఆయనొస్తే కూచోబెట్టండి' అని ఓ కుర్చీ వేయించి,
పక్కన ఇంకేమైనా మంచి లొకేషన్లు ఉన్నాయా అని చూడడానికి వెళ్ళి
వచ్చేలోగా  ఆయనొచ్చి కూచునేవారు. నేను రాగానే లేచి నిలబడే వారు.
' మీకన్నా దాదాపు ముప్ఫై ఏళ్ళు చిన్నవాణ్ణి సార్ ...' అని
సిగ్గుపడిపోతుంటే ' ఇక్కడ మీరు డైరెక్టరు ... నేను మిమ్మల్ని
గౌరవిస్తేనే యూనిట్ మిమ్మల్ని గౌరవిస్తుంది' అనేవారు అక్కినేని. 
షూటింగ్ ముగియగానే 'మళ్ళీ ఎప్పుడుండొచ్చు ?' అని అడిగేవారు.
'బహుశా వచ్చే నెల 10న వుండొచ్చండీ'  అని అంటే చాలు 8 వ తేదీ
పొద్దున్నే ఫోన్ వచ్చేసేది - 'కన్ఫర్మ్ డ్ గా వుందా ?' అంటూ.
'అయ్యో ఆ బాధ్యత మాది కదండీ ... మీరెందుకు టెన్షన్ పడతారు ? '
అని అంటే 'భలేవారే ... . రెండు రోజుల ముందు నుంచీ ఎర్లీగా
పడుకోవాలి. షూటింగ్ టైమ్ లో ముఖం ఫ్రెష్ గా కనిపించాలి కదా !?'
అనేవారు. అంత బాధ్యత ఫీలయ్యే నటీనటులు ఇవాళ ఎంతమంది
ఉండి ఉంటారు ? అంతవరకూ మనల్ని పేరు పెట్టి పిలిచే అక్కినేని
ఒకసారి షూటింగ్ టైమ్ గనుక ఫిక్స్ అయితే ఇంక ఆయన నుంచి
వచ్చేది 'ఓకే సర్' అనే. ఆ 'సర్' అనే పదం షూటింగ్ పూర్తయ్యే వరకూ
వుంటుంది. ప్యాకప్ అయిన వెంటనే మాయమైపోతుంది. మనల్ని మన
పేరుతోనే పిలుస్తారు. మనసుకి, మెదడుకి ఎంతో శిక్షణ ఇస్తేనే గాని
ఇంతటి క్రమ శిక్షణ సాధ్యం కాదు. 
 
 
 
 
 
 
చాలా విషయాలు నాతో పంచుకునే వారాయన. 'సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు వీలైతే ఓ సారి రండి' అని ఫోన్ చేసేవారు.
కారప్పూస, టీ ఆయన ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్. వెళ్ళేసరికి
ఇద్దరికీ రెడీ గా వుండేది. ఇక కబుర్లే కబుర్లు. 
ఎన్.టి.ఆర్. కొత్తగా కారు కొనుక్కున్నప్పుడు మొట్టమొదట
ఈయన్నే కూచోబెట్టుకుని డ్రైవ్ చేశారట. ఆ కారు కాస్త చిన్నది.
'బ్రదర్ ... నాకైతే ఫర్వాలేదు గానీ మీకు సీటు పెద్దది కదా ఎలా  మరి ?'
అని అడిగారట అక్కినేని. 'షూటింగ్ టైమ్ లో అయితే ప్రొడక్షన్
కార్లుంటాయి బ్రదర్. ఇక మిగిలిన టైమ్స్ లో ఆ మాత్రం సర్దుకోపోతే
ఎలా ? మీకంటే చిన్న సంసారం. మాకు పిల్లలెక్కువ కదా ...
కాస్త వాళ్ళ గురించి కూడా అలోచించాలి కదా ..  ఈ ఇనపముక్కల
కోసం ఎందుకంత వేష్ట్ చెయ్యడం ?' అని అన్నారట ఎన్.టి.ఆర్.
'కొన్ని పాత్రలు నేను వెయ్యకపోతే అవి ఎందుకు వెయ్యటం లేదో వాటి  
గురించి ఎన్.టి.ఆర్.కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాణ్ణి. ఎందుకంటే
తర్వాత అప్రోచ్ అయ్యేది ఆయన్నే కాబట్టి.' అని చెప్పారు ఏయన్నార్.
'బి.ఏ. సుబ్బారావు గారు రాణీ రత్నప్రభ సినిమా మొదట నాతోనే తీద్దామనుకున్నారు. అందులో హీరో పాత్ర కి ప్రాదాన్యత తక్కువ.
హీరోయిన్ అంజలీదేవి కి ఎక్కువ ఇంపార్టెన్స్. పైగా నేను జానపదాలు
మానేసి చాలా కాలం అయింది. ఫోక్ లోర్ హీరోగా జనం నన్ను
ఒప్పుకోకపోవచ్చు.' ఈ కారణాల వల్ల ఆ సినిమా ఒదులుకున్నాను.
నాకు తెలుసు సుబ్బారావు గారు ఎన్.టి.ఆర్. దగ్గిరికే వెళ్తాడని.
ఆయన అక్కడికి చేరకముందే బ్రదర్ కి ఫోన్ చేసి చెప్పాను -
ఇలా జరిగిందని. 'మీరు చెయ్యొచ్చు బ్రదర్ ... మీకు మాస్ ఇమేజ్
వుంది కదా ... పైగా సుబ్బారావు మనకి కావలసిన వాడు. నేను, మీరు
ఇద్దరం ఒప్పుకోకపోతే అతను ఇంకొక హీరో దగ్గరికి వెళ్తాడు. అప్పుడు
అతనికి వచ్చే లాస్ చాలా ఎక్కువగా వుంటుంది. దాన్ని తట్టుకోలేడు.
మీరైతే హిట్ అయితే లాభం. నష్టం వచ్చినా పెద్దగా వుండదు. మీ ఇమేజ్
హెల్ప్ అవుతుంది'  అన్నాను. 
ఎన్.టి.ఆర్. కొడుకు హరికృష్ణ మా ఇద్దర్నీ బాగా అబ్జర్వ్ చేస్తాడు.
'ఇండస్ట్రీ అంతా మీరిద్దరూ బద్ధ శత్రువులనుకుంటారు గానీ అసలైన
తోడు దొంగలంటే మీరిద్దరే బాబాయ్'  అని అంటాడు.
 
'గుర్తుకొస్తున్నాయి' తీస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో
ఆయనతో విభేదించాల్సి వచ్చేది. ఉదాహరణకి 'పూజాఫలం' సినిమాలో
ఆయన పక్కన వేసింది జగ్గయ్య అని నేనూ, కాదు రమణమూర్తి అని
ఆయనా వాదించుకున్నాం. 'ఆ సినిమాలో నేను హీరోని. నాకు
చెప్తారేంటి ?' అనేవారు. 'పోనీ ఓ పని చేద్దాం. మీ వెర్షన్ లో ఒకటి,
నా వెర్షన్ లో ఇంకోటీ షూట్ చేద్దాం. ఎడిటింగ్ కి ఇంకా టైముంది కనుక
వెరిఫై చేసుకుని చెప్తాను' అని అన్నాను. ఒక్క క్షణం అలోచించి ' వద్దు ...
మీ వెర్షనే కానివ్వండి. యూ ఆర్ ది కెప్టెన్' అని మనస్ఫూర్తిగా నేననుకున్న  
వెర్షన్ కే తన అనుభవాల్ని చెప్పారు. మర్నాడు సరిగ్గా ఉదయం 6 గంటలకి ... సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు ... ఏయన్నార్ గారి దగ్గర్నుంచి
ఫోన్ ... 'మీరే కరెక్ట్. పూజాఫలం లో నా పక్కన యాక్ట్ చేసింది జగ్గయ్యే.
మరి రమణమూర్తి అని ఎలా పొరబడ్డానో ఏమిటో ? ' అంటూ.
'రమణమూర్తి మీ పక్కన యాక్ట్ చేసింది అమాయకురాలి లో. అలా
కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయి వుంటుంది' అన్నాను. ' య్యస్ ... అదే
రీజనై వుంటుంది. ఎనీ వే ఐయామ్ సారీ... షూటింగ్ టైమ్ లో నేను
మీతో అలా ఆర్ గ్యూ చేసి వుండాల్సింది కాదు'  అని ఆయన అంటూంటే
ఆ సంస్కారం ముందు ఒక్కసారిగా అంగుష్టమాత్రుణ్ణి అయిపోయాను.
 
 
నేనేది అడిగినా కాదనేవారు కాదు. ఎంతో కఠినంగా తీసుకున్న నిర్ణయాలు
కూడా నా మీద అభిమానంతో సడలించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి - ఇక జీవితంలో అడుగు పెట్టనన్న సారధీ స్టూడియోస్ లో
దాదాపు ముప్ఫై ఏళ్ళ తర్వాత తిరిగి అడుగు పెట్టడం. నేను జీవితాంతం
గర్వంగా చెప్పుకోగలిగిన సంఘటన అది. దాని గురించి వివరంగా
చెప్పాల్సివస్తే అదొక ప్రహసనమే అవుతుంది. 
 
 
'గుర్తుకొస్తున్నాయి' 74 ఎపిసోడ్ లు. తెరపై ఏయన్నార్, సుమ తప్ప
ఇంకెవరూ కనిపించరు.  74 ఎపిసోడ్ లు తెర పై కేవలం ఇద్దరే ..
టెలివిజన్ చరిత్రలో అదొక రికార్డ్. 'నా జీవితంలోని ముఖ్యమైన
ఘట్టాలతో పాటు గుండెల్లో దాచుకున్న రహస్యాలతో సహా అన్నీ
కవర్ చేసేశారు మీరు. ఈ వయసులో కూడా నా జ్ఞాపక శక్తి
అమోఘంగా వుందని ప్రేక్షకులకి ఋజువు చేశారు.  నా ఆనందం
కొద్దీ ఇస్తున్నాను. కాదనకండి' అంటూ ఓ చెక్ ఇచ్చారాయన. 'నా ఉద్యోగ
ధర్మంగా నాకెంతో ఇష్టమైన మీ గురించి చేశాను. నేనిలా తీసుకోకూడదు.'
అన్నాను. దానికాయన ఎంత మురిసిపోయారో - ' ఐ లైక్ యువర్ క్యారెక్టర్' - అంటూ. అంతటితో ఊరుకోలేదు. నేను పని చేసిన మా టీవీ యాజమాన్యాన్ని ఒప్పించారు. తప్పని సరి పరిస్థితుల్లో తీసుకుని, డబ్బుగా వుంటే ఖర్చయిపోతుందని ఓ బంగారు కంకణం చేయించి ఆయనకు చూపించాను.
'మంచి పని చేశారు. వుంచండి. ఎప్పటికైనా ఆ కంకణాన్ని నేనే మీకు
తొడుగుతాను ' అని అన్నారు అక్కినేని. కానీ ఇవాళ ... కథ కంచికి
వెళ్ళిపోయింది ... చరిత్ర మాత్రం మిగిలింది ... బంగారం లాంటి ఆయనే లేరు . కంకణం మాత్రం  మిగిలిపోయింది ...ఆయన తొడగకుండానే ...
ఆయన గుర్తుగా .... !! 
 
రాజా (మ్యూజికాలజిస్ట్)